విద్యార్థుల బస్పాస్ను టీఎస్ఆర్టీసీ భారంగా మార్చింది. బస్పాస్ చార్జీలను ఏకంగా 3-4 రెట్లు పెంచేసి విద్యార్థులు బస్సు ఎక్కాలంటేనే జడుసుకునేలా చేసింది. గ్రేటర్ హైదరాబాద్లో రూ.215 ఉన్న నెలవారీ జనరల్ బస్పాస్ చార్జీని రూ.470కి పెంచింది. మూడు నెలల బస్పాస్ చార్జీని రూ.645 నుంచి రూ.1410కు పెంచింది. హైదరాబాద్ జిల్లాలో నెలవారీ జనరల్ బస్పాస్ చార్జీ రూ.165 నుంచి రూ.400కు, మూడు నెలల బస్పాస్ చార్జీ రూ.495 నుంచి రూ.1200కు పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 8 లక్షల బస్పాస్లు ఉన్నాయి. అందులో 5 లక్షల బస్పాస్లు విద్యార్థులవే. చార్జీల పెంపుతో విద్యార్థులపై రూ.12 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశముంది. రూట్ పాస్ల చార్జీలు కూడా 3-4 రెట్లు పెరిగాయి.4 కిలోమీటర్లలోపు రూట్ బస్పాస్ క్వార్టర్లీ చార్జీ రూ.165 నుంచి రూ.450కి పెరిగింది. 8 కిలోమీటర్లలోపు రూట్ బస్పాస్ చార్జీ రూ.200 నుంచి రూ.600కు పెరిగింది. ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల బస్పాస్ చార్జీలను మాత్రం రెండింతలు చేశారు. కాగా, బస్పాస్ చార్జీలు భారీగా పెరగడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్పాస్ చార్జీలను భారీగా పెంచడంతో సామాన్య, మధ్య తరగతి విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందని విద్యార్థి సంఘాలు ఆగహ్రం వ్యక్తం చేస్తున్నాయి.