CM YS Jagan: Meeting in Sri Satya Sai District On YSR Free Crop
రైతులకు మేలు చేసే విషయంలో దేశంతోనే పోటీ పడుతున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి (CM Jagan) అన్నారు.
మన రాష్ట్రంలో వ్యవసాయరంగంలోని మార్పును చూసి పక్క రాష్ట్రాలు అవలంబిస్తున్నాయని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో రైతుల ఖాతాల్లో పంటల బీమా మొత్తాన్ని సీఎం జమ చేశారు. 2021 ఖరీఫ్లో పంట నష్టపోయిన 15.61 లక్షల మందికి రూ.2,977 కోట్ల పరిహారాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మూడేళ్లలో రైతుల కోసం తమ ప్రభుత్వం రూ.1.28లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే)లను పరిశీలించే పరిస్థితిని తీసుకొచ్చామన్నారు. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అర్హుల జాబితా గ్రామ సచివాలయాల్లోనే పెట్టి పారదర్శకంగా ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నామని వివరించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల సాయం అందిస్తున్నామని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో ప్రభుత్వ సాయం అందని కుటుంబం ఏ ఒక్కటైనా ఉందా? అని జగన్ ప్రశ్నించారు.
సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెబుతున్నాం..
కోనసీమ(Konaseema)లో క్రాప్ హాలిడే పేరుతో రైతుల్ని కొందరు రెచ్చగొడుతున్నారని జగన్ ఆరోపించారు. క్రాప్ హాలిడే ఎందుకు? గతంలో ధాన్యం బకాయిలు ఎగ్గొట్టినందుకా? ఆ బకాయిలు వైకాపా ప్రభుత్వం తీర్చినందుకా? అని ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రైతులకు ధాన్యం సేకరణ డబ్బులు ఇచ్చేందుకు యత్నిస్తున్నామని సీఎం చెప్పారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని.. దళిత మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇళ్లను తగలబెట్టారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం చేస్తుంటే వారికి నచ్చడం లేదంటూ పరోక్షంగా విపక్షాలను ఉద్దేశించి అన్నారు. 70 శాతం మంత్రి పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారని.. సామాజిక న్యాయానికి తాము నిజమైన అర్థం చెబుతున్నామన్నారు.
ఆ విద్యార్థులను రెచ్చగొడుతున్నారు..
పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థులను కొందరు రెచ్చగొడుతున్నారని జగన్ ఆరోపించారు. కొవిడ్ పరిస్థితులతో రెండేళ్లపాటు విద్యార్థులు పరీక్షలు రాయలేదని.. ఒక్క పరీక్ష కూడా రాయకుండానే గత రెండేళ్లు వరుసగా పాస్ చేశామని గుర్తు చేశారు. పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలమా? అనే పరిస్థితుల్లో ఈ ఏడాది టెన్త్ పరీక్షలు నిర్వహించామని.. 67 శాతం ఉత్తీర్ణత సాధించామని చెప్పారు. గుజరాత్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత 65 శాతమేనని తెలిపారు. టెన్త్ ఫెయిలైన విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు వీలుగా సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైన వారినీ రెగ్యులర్గానే పరిగణిస్తామని జగన్ స్పష్టం చేశారు.