కోల్బెల్ట్ ప్రాంతం అధికార టీఆర్ఎ్సకు గుబులు పుట్టిస్తోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న వేళ.. కీలక నేతల వలసలు, కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, ఎప్పుడో నిర్వహించాల్సిన గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేసుకుంటూ రావడం, సింగరేణి అప్పుల్లో కూరుకపోవడం వంటి సమస్యలు.. ‘గులాబీ’ దళానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సింగరేణి సంస్థ పరిధిలో సుమారు 50వేల మంది కార్మికులు ఉండగా, మరో లక్ష మందికిపైగా సంస్థపై ఆధారపడి జీవిస్తున్నారు. కోల్బెల్ట్ ఏరియాలో 12 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను సింగరేణి కార్మికులు ప్రభావితం చేసే చాన్స్ ఉంది. భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, రామగుండం, మంథని, కొత్తగూడెం, ఇల్లందు, వైరా, పినపాక, సత్తుపల్లి నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికుల ఓట్లే కీలకం కావడంతో పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.
గత ఎన్నికల్లో టీఆర్ఎ్సకు షాక్గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ గాలి వీచినా కోల్బెల్ట్లో మాత్రం సగానికి సగం స్థానాల్లో కాంగ్రెస్ పాగా వేసింది. మూడు స్థానాల్లో మాత్రమే టీఆర్ఎస్ విజయం సాధించింది. 2017 అక్టోబరు 5న జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో 11 ఏరియాలకు తొమ్మిది చోట్ల అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ, కేవలం ఏడాది తర్వాత 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కార్మికులు టీఆర్ఎ్సకు షాక్ ఇచ్చారు. అనుహ్యంగా కాంగ్రెస్ కోల్బెల్ట్లో ఆరు చోట్ల విజయం సాధించింది.రామగుండం, వైరా అసెంబ్లీ స్థానాల్లో ఇండిపెండెంట్లు, సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి విజయకేతనం ఎగురవేశారు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన అధికార పార్టీ.. విపక్ష ఎమ్మెల్యేలకు ‘ఆకర్ష్’ వల విసిరింది. మంథనిలో గెలిచిన శ్రీధర్బాబు మినహా ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక టీడీపీ ఎమ్మెల్యే, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను ‘కారు’ ఎక్కించగలిగింది.తీవ్ర అసంతృప్తితో టీబీజీకేఎస్ నుంచి బయటకు వచ్చి బీఎంఎ్సలో చేరిన కార్మిక సంఘం నేత కెంగర్ల మల్లయ్యను సైతం తిరిగి సంఘంలోకి తీసుకున్నారు. అంతేకాదు.. 2019 ఫిబ్రవరి నెలలో టీబీజీకేస్ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కవితకు మళ్లీ అదే పదవి అప్పగించారు. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో ముఖ్య నేతల వలసలు టీఆర్ఎ్సను చికాకు పెడుతున్నాయి.
ఎమ్మెల్యేలకు పక్కలో బల్లెంలా..
ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్న గులాబీ బాస్.. ఇప్పటికే పలు మార్లు సర్వేలు నిర్వహించారు. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎ్సలో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది? అక్కడ టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? కొత్త, పాత నేతల మధ్య సమన్వయం ఎలా ఉంది? తదితర అంశాలపై ఆరా తీసినట్టు సమాచారం. ఈ సందర్భంగా చాలా మందిపై ఉద్యమకారులు, ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనట్లు తెలుస్తోంది. 45 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్టు వచ్చిన ఓ రిపోర్టులో కోల్బెల్ట్కు చెందిన వారూ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న చోట ఓడిపోయిన నేతలు కూడా పక్కలో బల్లెంలా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. భూపాలపల్లిలో మాజీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ మధుసూదనాచారి పర్యటిస్తుండటంతో.. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వర్గీయులు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితే పినపాక, ఇల్లందు, సత్తుపల్లితోపాటు చాలా నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ అధిష్ఠానం జోక్యం చేసుకోవడంతో ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. సర్వేల్లో ఎవరికి ప్రజా బలం ఉంటే వాళ్లకే టికెట్ దక్కుతుందనే ప్రచారం కూడా ఎమ్మెల్యేలను కలవర పెడుతోందని సమాచారం.
గుర్తింపు ఎన్నికలపై దాటవేతే..
కోల్బెల్ట్లో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణను ప్రభుత్వం కొన్నేళ్లుగా దాటవేస్తోంది. 2017 అక్టోబరు 5న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన టీబీజీకేఎ్సకు కేంద్ర కార్మిక శాఖ రెండేళ్ల కాలపరిమితితో గుర్తింపు పత్రాన్ని ఇచ్చింది. నాలుగేళ్ల కాలపరిమితిని రెండేళ్లకే కుదించడంపై టీబీజీకేఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆ నాలుగేళ్ల కాలపరిమితి కూడా గత ఏడాది అక్టోబరులోనే ముగిసినా.. గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. దీంతో పాటు లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థకు సుమారు రూ.85వేల కోట్ల అప్పులు ఉన్నట్టు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. విద్యుత్ సంస్థల నుంచి రూ.13వేల కోట్లు, బొగ్గు, కరెంట్ అమ్మకాలతో సింగరేణికి రూ.17,899 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ బకాయిలను ఇప్పించకపోగా, వృద్ధి పన్నుల పేరుతో కోల్బెల్ట్లోని 12మంది ఎమ్మెల్యేలకు రూ.2కోట్ల చొప్పున ఏటా రూ.24కోట్లను సింగరేణితోనే ఇప్పిస్తోంది. ఈ కారణాల వల్లే సింగరేణి అప్పులకుప్పగా మారుతోందని కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపఽఽథ్యంలో సింగరేణిలో గుర్తింపు ఎన్నికలకు వెళ్తే ప్రతికూల ఫలితాలు వస్తాయనే అంచనాతో టీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందన్న అంచనాలతో గుర్తింపు సంఘం ఎన్నికలను దాటవేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
కోల్బెల్ట్లో గులాబీకి ముచ్చెమటలు!అధికార పార్టీకి ముఖ్య నేతల గుడ్బై
ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నేతలు సైతం టీఆర్ఎ్సకు గుడ్బై చెబుతుండటం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, రామగుడం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రమణారెడ్డి కుమారుడు సునీల్రెడ్డి తదితరులు కాషాయ గూటికి చేరడంతో ఆ పార్టీలో జోష్ నెలకొంది. కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో పాటు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు కోల్బెల్ట్లో తరచూ పర్యటిస్తూ కార్మిక వర్గాల్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికితోడు ఇటీవల చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లెల ఓదెలు, తన సతీమణి మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లెల భాగ్యలక్ష్మితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం కోల్బెల్ట్లో సంచలనంగా మారింది. గతంలో టీడీపీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి, 2018 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసిన గండ్ర సత్యనారాయణరావు సైతం ఇటీవలే రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. వీరితోపాటు కోల్బెల్ట్ పరిధిలోని కొందరు కీలక నేతలు కాంగ్రె్సలో చేరడం గులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.