పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం పరుగుల ప్రవాహం కొనసాగుతోంది. వెస్టిండీస్తో ముల్తాన్లో జరిగిన తొలి వన్డేలో సెంచరీ బాదిన బాబర్.. టీమిండియా మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుగొట్టాడు. ఈ మ్యాచ్లో తొలుత ఓపెనర్ షాయ్ హోప్ సెంచరీ (127)తో చెలరేగడంతో విండీస్ తొలుత 8 వికెట్ల నష్టానికి 305 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 306 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
కెప్టెన్ బాబర్ ఆజం సెంచరీ (103) చేసి జట్టుకు విజయాన్ని అందించి పెట్టాడు. అంతేకాదు, మరో ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే జట్టు కెప్టెన్గా 1000 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్గా విరాట్ కోహ్లీ 17 ఇన్నింగ్స్లలో 1000 పరుగులు సాధిస్తే.. బాబర్ కేవలం 13 ఇన్నింగ్స్లలోనే ఆ ఘనత అందుకోవడం గమనార్హం. బాబర్ సాధించిన ఈ ఘనతను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఈ మ్యాచ్లో బ్యాటింగుకు దిగడానికి ముందు కోహ్లీ రికార్డును బద్దలుగొట్టేందుకు బాబర్కు 98 పరుగులు అవసరం కాగా, సెంచరీ బాది రికార్డును అధిగమించాడు.
పాకిస్థాన్ జట్టు టీ20ల్లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, వన్డేలు, టెస్టుల్లో నాలుగో స్థానంలో ఉంది. కెప్టెన్గా బాబర్ ఆడిన 13 ఇన్నింగ్స్లలో 7 స్వదేశంలోనే అయినప్పటికీ ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో బాబర్ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు.