ఆంధ్రప్రదేశ్ చెస్ సంఘం, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో గ్రాండ్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నీ శుక్రవారం ప్రారంభం కానుంది. గీతం విశ్వవిద్యాలయం వేదికగా ఏడు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో పలు దేశాలకు చెందిన 15 మంది గ్రాండ్ మాస్టర్లు, 14 మంది ఇంటర్నేషనల్ మాస్టర్లు, ఇద్దరు ఉమెన్ గ్రాండ్ మాస్టర్లు, ఏడుగురు ఫిడే మాస్టర్లు, ఇద్దరు ఉమెన్ ఫిడే మాస్టర్లు, ఇద్దరు క్యాండిడేట్ మాస్టర్లు పాల్గొననున్నారు.
భారత్కు చెందిన గ్రాండ్ మాస్టర్లు హర్ష భరత్కోటి, నీలోత్పల్ దాస్, ఆర్ఆర్ లక్ష్మణ్, ఇతర దేశాలకు చెందిన గ్రాండ్ మాస్టర్లలో అమోనాటోప్ ఫరూఖ్ (తజికిస్తాన్), పైచాల్డే లుకా (జార్జియా), ఫెడోరోవ్ అలెక్సీ (బెలారస్), మిహైల్ (బెలారస్), స్తూపర్ కిరిల్ (బెలారస్), హుస్సేన్ ఇనాముల్ (బంగ్లాదేశ్) పాల్గొంటున్నారు. ఈ టోర్నీలో గ్రాండ్ మాస్టర్, ఇంటర్నేషనల్ మాస్టర్లను కేటగిరీ-ఏగా, రెండు వేలు రేటింగ్ కలిగిన క్రీడాకారులు కేటగిరీ-బీగా, 1600 రేటింగ్ కలిగిన ఆటగాళ్లను కేటగిరీ-సీగా విభజించారు. కేటగిరీ-ఏ విజేతలకు రూ.15 లక్షలు, కేటగిరీ-బీ విజేతలకు రూ.5 లక్షలు, కేటగిరీ-సీ విజేతలకు రూ.5 లక్షలు నగదు బహుమతులు అందజేయనున్నారు.