ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్న కొడుకు రాజారాం భోంస్లే భార్య.. తారాభాయ్ భోస్లే
కరవాలం తిప్పుతుంటే ఆవిడ మీద విసిరిన వడ్లగింజలు ఆవిడ ఒంటిని తాకలేకపోయేవట. నేటికీ మాల్వా ప్రాంతంలో ఆవిడ జానపదుల పాటల్లో సజీవంగా ఉన్నారు. ఆవిడ గుర్రం మీద వెళ్తుంటే వెనుక ఉన్న వారికి దుమ్ము తప్ప గుర్రం కనబడేది కాదట.
శంభాజీ మహరాజ్ ను ఔరంగజేబ్ క్రూరంగా హింసించి చంపిన తర్వాత శివాజీ మహరాజ్ చిన్న కొడుకు రాజారాం రాయ్ ఘడ్ కోట నుంచి నేటి తమిళనాడు జింగీ కోటకు వలస వెళ్లారు.
అక్కడ నుంచే ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని పాలించేవారు. దురదృష్టవశాత్తూ ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో అక్కడే మరణించారు. అప్పటికి మహారాణి తారాభాయ్ భోంస్లే వయసు కేవలం 25 ఏళ్ళు. ధైర్యం కోల్పోకుండా తిరిగి రాయ్ ఘడ్ కు చేరుకొని మరాఠా సైన్యానికి నాయకత్వం వహించి కోల్పోయిన కోటలన్నీ తిరిగి రాబట్టారు. ఆవిడ ప్రతి కోటనూ తన నియంత్రణలోకి తెచ్చుకొని కొత్తగా మాల్వాప్రాంతాన్ని(ఉజ్జయిన్..బుర్హాంపూర్..సిరోంజీ..ముంద్రా) తన అధీనంలోకి తెచ్చుకున్నారు.
ఒక విధవ ఇద్దరు చిన్నపిల్లలతో తననేమి గెలవగలదని మదంతో తారాభాయ్ మీద యుద్ధానికి వచ్చిన నాటి ఔరంగజేబ్ సేనాని ఆలంగీర్ గుండెల మీద తన గుర్రాన్ని పైకి లేపి డెక్కలతో కొట్టి కిందపడేసిన సివంగి మహారాణి తారాభాయ్.
బతుకుజీవుడా అని పారిపోయి తిరిగి తన జీవితకాలంలో మరాఠాల మీదకు యుద్ధానికి వచ్చే సాహసం చేయలేదు పిరికి ఆలంగీర్. తన బావ శంభాజీ..భర్త రాజారాం ల మరణంతో నీరసించిన వీర మరాఠా సైన్యాన్ని పునర్నిర్మించి అజేయంగా మలచి కోటలను శత్రు దుర్భేద్యంగా నిర్మించి 27 ఏళ్ళు పాటు మరాఠా సామ్రాజ్యాన్ని అవిచ్చన్నంగా ఏలిన ‘వారియర్ క్వీన్’.. భారత్ లో ఒక రాణి ఝాన్సీ.. కాకతీయ రుద్రమ్మ..చౌతా అబ్బక్క ల సరసన చేర్చదగ్గ వీరవనిత మహారాణి తారాభాయ్.