రాష్ట్రంలో పాగా వేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోందా ? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. కేంద్రం తీరు చూస్తుంటే వైసీపీకి మున్ముందు గడ్డుకాలమే అన్పిస్తోంది. ఏపీ గవర్నర్ను ఉన్నట్టుండి మార్చేసింది.
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను తప్పించి, సుప్రీం కోర్టు మాజీ జడ్జీ జస్టిస్ అబ్దుల్ నజీర్కు బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది.
కేంద్రంతో జగన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలన్నింటికి మద్ధతు ఇస్తూ వచ్చారు జగన్. రాష్ట్రానికి రావాల్సన అంశాలపై కూడా పెద్దగా అడిగిందీ లేదు. ప్రత్యేక హోదా అంశాన్ని లైట్ తీసుకున్నారు. నిధుల విషయంలోనూ పార్లమెంట్లో గట్టిగా పోరాడింది లేదు. ఇక పోలవరం ఊసే లేదు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లడం, పెద్దలను కలవడం, బయటకు ప్రెస్ నోట్లు ఇవ్వడం కామన్గా మారిపోయింది. జగన్ డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా స్పందించిన దాఖలాలు చాలా తక్కువ. అంతేందుకు మూడు రాజధానుల విషయంలోనూ అదే జరిగింది. సుప్రీం కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం..తమను సంప్రదించకుండానే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పింది. అంతేకాదు అమరావతి చట్ట పరధిలో ఉందని తెల్పింది. కేంద్రం ఎన్ని చేసినా కిక్కురుమనకుండా పడి ఉంటోంది వైసీపీ. ఇలాంటి సమయంలో గవర్నర్ను సైతం మార్చేసింది.
2019లో గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన విశ్వభూషణ్…వివాదాల జోలికి పోలేదు. వైసీపీ ప్రభుత్వంతో మంచి సంబంధాలను కొనసాగించారు. ఏ బిల్లువిషయంలోనూ అభ్యంతరం చెప్పలేదు. చివరికి రాజధానుల అంశంపై కూడా ఏమీ మాట్లాడలేదు. మూడు రాజధానులు సహా అత్యంత వివాదాస్పదమైన చట్టాలు చేసినా వాటికి ఆమోదం తెలిపారు. కేంద్రాన్ని సంప్రదించకుండా, సమాచారం ఇవ్వకుండా గవర్నర్ తన పనులు పూర్తి చేశారు. గవర్నర్ తీరుపై ఢిల్లీ పెద్దలు అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు అనేక సందర్భాల్లో కోర్టుమెట్లెక్కిన అనేక బిల్లులను గవర్నర్ న్యాయపరిశీలన కోరకుండానే ఆమోదించారన్న విమర్శలు ఉన్నాయి. వీటిన్నింటినీ గమనించిన కేంద్రం..గవర్నర్నే మార్చేసింది.
జగన్ దూకుడుకు చెక్పెట్టడానికే జస్టిస్ అబ్దుల్ నజీర్ను గవర్నర్గా నియమించారనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ వివాదాల జోలికిపోని జస్టిస్ అబ్దుల్ నజీర్…నిజాయితీపరుడిగా గుర్తింపుపొందారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగరు. ఈయన ద్వారా జగన్కు చెక్ పెట్టవచ్చని, మరీ అడ్డగోలుగా వ్యవహరించకుండా నిలువరించవచ్చనే ఆలోచనతోనే గవర్నర్గా ఎంచుకున్నారని చెబుతున్నారు.
తెలంగాణ ఫార్ములాను ఏపీలో అమలు చేయబోతోందా ?
తెలంగాణ గవర్నర్ తరహాలో గవర్నర్ను నియమించాలని భావించిన కేంద్రం…అబ్దుల్ నజీర్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చాలా విషయాల్లో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. గతేడాది వరకు రాష్ట్ర ప్రభుత్వం అడగడమే ఆలస్యం.. అదనపు అప్పులకు అనుమతి ఇచ్చేది. ఇప్పుడు కాస్త తగ్గించింది. ఇటు రాష్ట్ర బీజేపీ నేతలు సైతం విమర్శలు సంధిస్తున్నారు. జగన్ సర్కార్ తీరుపై ప్రెస్మీట్లు పెట్టి విమర్శిస్తున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం అంత దూకుడుగా వెళ్లడం లేదు. ఈ గవర్నర్తో మున్ముందు ఎలా వ్యవహరిస్తోరో చూడాలి.