భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేసారు. వచ్చే నెల జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అవసరమైతే జూలై 21న కౌంటింగ్ నిర్వహిస్తారు. జూలై 24వ తేదీ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లను ఈ నెల 29వ తేదీ వరకు స్వీకరిస్తారు. జూన్ 30న స్క్రూటినీ జరగనుంది. జూలై 2 వరకు నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం ఉంటుంది. ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే నెల 25వ తేదీతో ముగియనుంది.
ఓటింగ్ హక్కు..ఎవరెవరికి ఛాన్స్
వచ్చే నెల 24వ తేదీ లోగా ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సీఈసీ ప్రకటించారు. పార్లమెంట్ … రాష్ట్రాల అసెంబ్లీల సభ్యులు కలిసి ఎలక్టోరల్ కాలేజీగా రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. లోక్ సభలోని 543 మంది సభ్యులు..233 మంది రాజ్యసభ సభ్యులు కలిపి 776 మంది ఓటింగ్ హక్కు కలిగి ఉన్నారు. అదే విధంగా 4,120 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలోని సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ సభ్యుల ఓటు హక్కు విలువ ఎక్కువగా ఉంది. ఆ తరువాత మహారాష్ట్ర..పశ్చిమ బెంగాల్ సభ్యుల ఓటు హక్కు విలువ ఎక్కువగా ఉంటుంది.
ఓటింగ్ విధానం ఇలా..
ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో..అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు తమ సంబంధిత అసెంబ్లీ ప్రాంగణంలో ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుందని సీఈసీ స్పష్టం చేసారు. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ అవకాశం లేదు. లోక్ సభ జనరల్ సెక్రటరీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 10,86,431 ఓట్లు ఉన్నట్లుగా సీఈసీ ప్రకటించారు. 5,34,680 ఓట్లు దక్కిన వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నిక అవుతారు. అభ్యర్ధి నామినేషన్ వేసే సమయంలో 50 మంది మద్దతుగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ… పర్యావరణ పరిరక్షణ చర్యలతో ఎన్నికలను నిర్వహిస్తామని సీఈసీ వెల్లడించారు.