AP High Court Fires on MRO over Theater seize
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్లు మూసివేత, సినిమా టికెట్ల వ్యవహారానికి ఇంకా ఫుల్స్టాప్ పడలేదు. అయితే నిబంధనలను విరుద్ధంగా నడుపుతున్న థియేటర్లను పలు చోట్ల ఎమ్మార్వోలు రంగంలోకి మూసివేయించారు. దీంతో చేసేదేమీ లేక సదరు థియేటర్ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని శ్రీనివాస మహల్కు సంబంధించి కోర్టులో వాదనలు జరిగాయి. ఈ క్రమంలో సినిమా థియేటర్కు తాళమా.. అసలు మీకు ఆ అధికారం ఎవరిచ్చారు..? వెంటనే తెరిస్తే సరే లేకుంటే కఠిన చర్యలుంటాయ్.. అని ఎమ్మార్వోపై హైకోర్టు కన్నెర్రజేసింది.
అసలేం జరిగిందనే విషయానికొస్తే..
శ్రీనివాస మహల్ను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని పలు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన తహసీల్దార్ దాన్ని మూసివేయించారు. థియేటర్ మేనేజింగ్ పార్టనర్ ఎస్.శంకరరావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నిశితంగా హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ టెక్కలి సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ వ్యవహరించారని చెప్పారు. ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చిన న్యాయస్థానం.. థియేటర్ను సీజ్ చేసే అధికారం తహసీల్దార్కు లేదని స్పష్టం చేసింది. లైసెన్స్ జారీ చేసే అధికారం ఉన్న జాయింట్ కలెక్టర్ అధికారమిచ్చిన వ్యక్తికి మాత్రమే జప్తు చేయాల్సి ఉంటుందని, కానీ ఆ అధికారాన్ని తహసీల్దార్కు జాయింట్ కలెక్టర్ ఇవ్వలేదని పేర్కొంది. కాబట్టి థియేటర్ను తిరిగి తెరవాలని న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఆదేశించారు. అయితే ఇలాంటి థియేటర్లు రాష్ట్ర మొత్తమ్మీద చాలానే ఉన్నాయ్.. అవి ఎప్పుడు తెరుచుకుంటాయో ఏంటో..!