PM Narendra Modi to visit Bhimavaram in Andhra Pradesh on July 4
వచ్చేనెలలో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం పర్యటనా ఏర్పాట్లు బాగున్నాయనీ అలాగే ఈ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలన్నీ బాగున్నాయంటూ కేంద్ర పర్యాటక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి జి కిషన్ రెడ్డి ప్రశంసించారు. విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా ఆయన భీమవరం తదితర చోట్ల కార్యక్రమాలను పర్యవేక్షించారు. రాష్ట్ర బి. జె. పి అధ్యక్షుడు సోము వీర్రాజు, మంతెన రామరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, కార్యక్రమ సారధి నడింపల్లి నానీరాజు సహా పలువురు ప్రముఖులతో కలిసి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని, సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మోగల్లులో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరి నడయాడిన స్వస్థలంలో మొక్కలు నాటారు. అలాగే కుముదవల్లిలో 125సం. నాటి కందుకూరి వీరేశలింగం కవిసమాజ గ్రంధాలయాన్ని సందర్శించారు. ఇంకా భీమవరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
స్వాతంత్ర్య 75వ అమృతో త్సవాల్లో భాగంగా జులై 4న అల్లూరి జయంతి వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయా ఏర్పాట్లను శ్రద్ధగా పరిశీలించారు. పెదఅమిరం గ్రామం, రాధకృష్ణ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పలువురు ప్రముఖులు ఆయనతో కలిసి ఈ సందర్భంగా పాల్గొన్నారు.. ఇందులోజిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి సహా అనేకమంది అధికారులు, క్షత్రియ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.