Mahasena Rajesh Joins TDP. Mahasena Rajesh started supporting the Janasena political party from the beginning of 2022, strategically.
ఏపీలో ఎన్నికల సీజన్ అప్పుడే మొదలైంది. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో…పార్టీల్లో జంపింగ్లు ఊపందుకున్నాయి. అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న కొందరు… ఖర్చీఫ్ వేసుకోడానికి రెడీ అయిపోతున్నారు. అన్ని లెక్కలు వేసుకొని పార్టీలు మారిపోతున్నారు. నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఇష్యూ మరిచిపోక ముందే… సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన మహాసేన రాజేష్… టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 16న చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. అందరూ జనసేనలో చేరుతారని భావించినా, మహాసేన రాజేష్ మాత్రం సైకిల్ పార్టీకే జెండా ఊపారు.
మహాసేన రాజేష్ నిర్ణయం జనసైనికులకు నచ్చడం లేదు. కష్టాల్లో వెన్నంటి ఉన్న పార్టీని కాదని, ఏదో ఆఫర్ ఇచ్చారని మరో పార్టీలో చేరడం ఏంటని సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేరు జపిస్తూ, ఆయనపై అభిమానం కురిపించిన రాజేష్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అస్సలు ఊహించలేదంటున్నారు. మహాసేన రాజేష్ తీరుపై ట్వీట్లతో ఫైరయ్యారు జనసేన పార్టీ శ్రేణులు. దీనిపై స్పందించిన నాగబాబు… ఎవరూ ఆయన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
జనసేన కార్యకర్తల ఆరోపణలు పక్కనబెడితే…మహాసేన రాజేష్ ఏ పార్టీలో చేరాలన్నది ఆయన వ్యక్తిగతం. ఆయన ఎవరికైనా మద్దతు ఇవ్వొచ్చు, ఏ పార్టీలోనైనా పోటీ చేయచ్చు. అందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావిస్తూ, ఆయనే తన అభిమాన హీరో అంటూ, జనసేనతోనే బహుజనులకు న్యాయం జరుగుతుందని నమ్మిన వ్యక్తి సడెన్గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.
మహాసేన రాజేష్ నుంచి ఇలాంటిది ఎవరూ ఊహించి ఉండరు. సోషల్ మీడియా ద్వారా ఆయన చెప్పే మెస్సేజ్లు, బహుజన సమాజం కోసం ఆయన తాపత్రయపడే తీరు చూసి, చాలా మందిలో మంచి అభిప్రాయం ఏర్పడింది. రాజకీయ నేతల్లా కాకుండా, తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాడని అనుకున్నారు. మహాసేన పేరుతో రాజేష్ ఎంత ఫేమస్ అయ్యాడో తెలియదు కానీ, పవన్ కళ్యాణ్ పేరును పదే పదే ప్రస్తావించడం, పవన్ కళ్యాణ్ సైతం పలుమార్లు ఆయనకి మద్దతు ప్రకటించడంతో…రాష్ట్రమంతా తెలిశాడు. జనసైనికులు సైతం దగ్గరయ్యారు. మహాసేన రాజేష్ జనసేనలోకి వస్తారని అంతా అనుకున్నారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు.
ఐతే టీడీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన రాజేష్…ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. 2018లోనే టీడీపీలో చేరాలని భావించానని, ఒక నేత అడ్డుకోవడంతో అది సాధ్యం కాలేదన్నారు. జగన్ గుర్తించి తనని వైసీపీలోకి ఆహ్వానించారంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్లు ఇప్పుడు చర్చకు దారి తీశాయి. టీడీపీపైన అభిమానం ఉంటే వైసీపీలో చేరడమేంటని ప్రశ్నిస్తున్నారు. సరే అందులోనైనా కొనసాగారా అంటే అదీ లేదు. ఏవో తేడాలు రావడంతో బయటకు వచ్చి వైసీపీని తిట్టిపోస్తున్నారు. అలా జనసేనకు దగ్గరై, మళ్లీ ఇప్పుడు టీడీపీ పంచన చేరారు. పెద్దాపురం టికెట్ ఇస్తామనే ఆఫర్ రావడంతో, జనసేనలో చేరాలన్న ఆలోచనను పక్కనపెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇలాంటి చర్యలతో మహాసేన రాజేష్ క్రెడబులిటీపై అనుమానాలు రావడం సహజమే. ఆయన పార్టీలు మారడం నిలకడలేని తనాన్ని నిరూపిస్తున్నాయంటున్నారు జనసైనికులు.