పవన్కల్యాణ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేన మిత్రపక్షం భారతీయ జనతాపార్టీ కూడా అంగీకరించడంలేదు. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం అనేది ఢిల్లీ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండురోజుల పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ వచ్చారు. ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఎటువంటి చర్చకు అవకాశం లేదని తేల్చిచెప్పారు.
తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సమయంలో అదే చెప్పారే?
తిరుపతి లోక్సభకు జరిగిన ఉప ఎన్నికల సమయంలో భారతీయ జనతాపార్టీ అభ్యర్థి పోటీచేస్తే జనసేన మద్దతు ప్రకటించింది. ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కల్యాణ్ అని బీజేపీ నేతలంతా ప్రకటించారు. ఆ తర్వాత ఇరుపార్టీల మధ్య దూరం పెరిగింది. కరోనావల్ల భౌతిక దూరం పెరిగిందని, కరోనా తగ్గిపోగానే ఆ దూరం కూడా తగ్గిపోతుందని తాజాగా పవన్ వ్యాఖ్యానించారు. తిరుపతి ఉప ఎన్నికలైన తర్వాత భారతీయ జనతాపార్టీ ఏపీలో పలు కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమానికి మిత్రపక్షం తరఫున పవన్కల్యాణ్ను కానీ, స్థానికంగా ఉండే జనసేన నేతలను కానీ ఆహ్వానించలేదు. ప్రస్తుతం జరుగుతున్న జేపీ నడ్డా పర్యటనకు కూడా ఇదే పరిస్థితి. దీనిపై జనసైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
పవన్ లాంటి ప్రజాదరణ ఉన్న నాయకుడు బీజేపీలో ఏరి?
ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంతవరకు బీజేపీతో పోల్చుకుంటే జనసేనే పెద్ద పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనతో పొత్తున్నా కనీసం ఒక వార్డును కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది. ఆ పార్టీలో పవన్కల్యాణ్ లాంటి ప్రజాదరణ ఉన్న నాయకుడు కూడా లేరు. ఏపీలోని కొంతమంది బీజేపీ నేతలు అధికారంలో ఉన్న వైసీపీకి కోవర్టుల్లా పనిచేస్తున్నారని పవన్ ఆరోపణ. తాను ఒకవైపు ఆ పార్టీపై పోరాటం చేస్తుంటే అంతర్గతంగా కొందరు బీజేపీ నేతలు మద్దతిస్తుండటంతో ఆ పార్టీకి దూరం జరగాలని జనసేనాని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జరుగుతున్న పరిణామాలు కూడా ఆ నిర్ణయాన్ని బలపరిచేలా ఉన్నాయి.
బీజేపీలో ఉన్న మిత్రులద్వారా వైసీపీ వ్యూహం?
పవన్కల్యాణ్ బరిలో ఉన్నంతవరకు కాపుల ఓట్లు తమ పార్టీకి పడవనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావనగా ఉంది. బీజేపీలో ఉన్న తన మిత్రులద్వారా జనసేన పార్టీని వ్యూహాత్మకంగా నిర్వీర్యంచేసే ప్రయత్నం సాగుతోందని జనసేన నాయకులు, కార్యకర్తలు అనుమానిస్తున్నారు. ముందుగానే జాగ్రత్త పడాలని, బీజేపీతో అవసరమైతే పొత్తును కూడా వదులుకోవాలని పవన్పై ఒత్తిడి తెస్తున్నారు. ఏదన్నాకానీ జనసేన, బీజేపీ రాజకీయాలు భవిష్యత్తులో అనూహ్య మలుపులు తిరగబోతున్నాయని స్పష్టమవుతోంది.