అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. తాజాగా పశ్చిమ మేరీల్యాండ్లోని స్మిత్బర్గ్లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కొలంబియా మెషీన్ అనే వస్తు తయారీ కంపెనీలోకి చొరబడ్డ దండగుడు తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడినట్లు సమాచారం. కంపెనీ ఉద్యోగుల సమాచారంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. దుండగుడిని పశ్చిమ వర్జీనియాకు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు.. అతడు అదే కంపెనీ పనిచేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, అతడు ఎందుకు కాల్పులు జరిపాడనే విషయాన్ని పోలీసులు తెలుసుకునే పనిలో ఉన్నారు.
Maryland Shooting: అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి! ఇదిలాఉంటే.. ఇటీవల యూఎస్లో చోటు చేసుకుంటున్న వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నెల 1వ తేదీన ఓక్లహామాలోని తుల్సాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఆస్పత్రిలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఆర్థోపెడిక్ సర్జన్ కోసం వచ్చిన దుండగుడు.. ఆ వైద్యుడు కనిపించలేదని విచక్షణారాహిత్యంగా కాల్పులు జరిపాడు. అలాగే దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన టెక్సాస్లోని ఓ ఎలిమెంటరీ పాఠశాలలో 18 ఏళ్ల కుర్రాడు కాల్పులకు తెగబడిన ఘటనలో 19 మంది చిన్నారులు సహా 21 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలా అగ్రరాజ్యంలో చోటు చేసుకుంటున్న వరుస కాల్పులతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.